
అమెరికాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వహించిన కేబినెట్ మీటింగ్లో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రుబియో మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలిసింది. అధ్యక్షుడు ట్రంప్ ముందే ఇద్దరూ వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగినట్లు తెలిసింది.

రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డోజ్) శాఖను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ శాఖ బాధ్యతలను టెస్లా బాస్ ఎలాన్ మస్క్కు అప్పగించారు. మెరుగైన పాలన, ప్రభుత్వంలో వృథా ఖర్చుల్ని తగ్గించేందుకు డోజ్ శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ట్రంప్, కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్కు మస్క్తోపాటు విదేశాంగ మంత్రి మార్కో రుబియో కూడా హాజరయ్యారు.

ఆ సమయంలో మస్క్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో పనిచేయని ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెప్పారు. అయితే, రుబియో మాత్రం ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించలేదని వ్యాఖ్యానించారు. మస్క్ మాటలకు రుబియో సహనం కోల్పోయారు. ఇప్పటికే 1,500 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేసినట్లు చెప్పారు. తాను ఉద్యోగులను తొలగించాలంటే పదవీ విరమణ చేసిన వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాల్సి ఉంటుందంటూ సమాధానమిచ్చారు.
