మలేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఎలాంటి వీసా లేకుండానే భారత్, చైనా నుంచి వచ్చే పర్యాటకులు మలేషియా పర్యటనకు అనుమతిచ్చింది. ఈ మేరకు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం పీపుల్స్ జస్టిస్ పార్టీ కాంగ్రెస్వార్షిక సమావేశంలో వెల్లడించారు. మలేషియా ఆర్థికంగా ముందుకెళ్లాలంటే పర్యాటక రంగ అభివృద్ధి కీలకం అని మలేషియా ప్రధాని తెలిపారు. ఇందులో భాగంగానే చైనా, భారత్ పౌరులకు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి చైనా, భారతీయ పౌరులు వీసా లేకుండా మలేషియాలో పర్యటించేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. మలేషియాలోకి దేశంలోకి ప్రవేశించాక 30 రోజుల పాటు ఉండొచ్చని ఆయన తెలిపారు. భారత్, చైనా నుంచి వచ్చే పర్యాటకులు, పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు వీసా సౌకర్యాలను మెరుగుపరుస్తామని గత నెలలోనే అన్వర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అందుకు సంబంధించిన ప్రకటన వెలువరించారు.
