అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యూఎస్ ప్రభుత్వం అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ఆ దేశానికి వెళ్లాలనుకునే వారికి హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలో ఎవరిపైనా దాడి చేసినా దొంగతనాలు, దోపిడీకి పాల్పడితే సదరు వ్యక్తుల వీసా రద్దవుతుందని స్పష్టం చేసింది. నిందితులు మళ్లీ అమెరికాలో కాలు మోపేందుకు అనుమతి ఉండదని పేర్కొంది. దాడులు, దొంగతనాలు, దోపిడీతో చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవడంతో వీసా రద్దవుతుందని స్పష్టం చేసింది.

మళ్లీ భవిష్యత్లో యూఎస్ వీసా పొందేందుకు అనర్హలవుతారని తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ శాంతిభద్రతలకు విలువ ఇస్తుందని, విదేశీ సందర్శకులు అన్ని యూఎస్ చట్టాలను పాటించాలని ఆశిస్తుందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. అమెరికా నుంచి అక్రమ వలసదారులను బయటకు పంపే కార్యక్రమం కొనసాగుతున్నది. జనవరి 20 నుంచి ఏప్రిల్ 29 వరకు 1.42లక్షల మందిని అమెరికా నుంచి బహిష్కరించారు.















