ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో కొత్త జిల్లాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభించాలంటూ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలిచ్చారు. జనగణన పూర్తయ్యేలోగా విభజనకు సంబంధించి ప్రాథమిక ప్రక్రియ పూర్తి చేసి నోటిఫికేషన్కు సిద్ధం కావాలని ఆదేశించారు. జనగణన ఉన్నప్పుడు ప్రక్రియను చేపట్టడం సరికాదని అధికారులు సూచించినట్లు సమాచారం. ఈలోగా ప్రాథమిక కసరత్తు, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆదేశాలిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో వైసీపీ ప్రకటించింది. అరకు పార్లమెంటును రెండు జిల్లాలగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు వైపు ప్రత్యేక దృష్టి సారించింది. ఆ దిశగా పార్లమెంట్ నియోజకవర్గాలను 25 జిల్లాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)