ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన రాజు (30) మృతి చెందాడు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి ఉద్యోగం సాధించి స్థిరపడిన సమయంలో ఒక్కసారిగా మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..రాజు ఆస్ట్రేలియా దేశంలో ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగం సంపాదించాడు. రాజు ఇంటర్మీడియెట్ వరకు పట్టణంలో హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేసి ఎంఎస్ చదవడానికి 2018లో ఆస్ట్రేలియా వెళ్లాడు. రెండేళ్లలో ఎంఎస్ పూర్తి చేసి గత సంవత్సరం అక్కడ పోస్టల్ డిపార్టుమెంటులో ఉద్యోగం చేస్తున్నాడు.
ఆదివారం రాత్రి స్నేహితులతో కారులో ఇతర ప్రాంతానికి వెళ్లి తిరిగి వస్తుండగా సిడ్నీ పరిధి క్యూస్ల్యాండ్ వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో రాజు మృతి చెందాడు. ఈ విషయం అతడి స్నేహితుల ద్వారా తెలిసింది. మార్చిలో స్వదేశానికి వచ్చి పెళ్లి చేసుకోవాల్సి ఉండగా ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో రాజు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి మృతదేహాన్ని స్వదేశానికి తర్వగా తెప్పించాలని కోరుతున్నారు.