సెల్ఫీలు అమ్మి కూడా డబ్బులు సంపాదించవచ్చా. అవును సెల్పీలు అమ్మి కూడా కోట్లు సంపాదించవచ్చని నిరూపించాడు ఇండోనేషియాకు చెందిన సుల్తాన్ గుస్తాఫ్ అల్ ఘోజాలీ. ఇండోనేషియా సెంట్రల్ సిటీ ఆఫ్ సెమరాంగ్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్. ఘోజాలి గత ఐదేళ్లుగా దాదాపు ప్రతిరోజూ తన కంప్యూటర్ ముందు కూర్చొని సెల్ఫీలు తీసుకునేవాడు. ఇలా అతను దాదాపు వెయ్యి సెల్ఫీలను తీసుకున్నాడు. పైగా తన గ్రాడ్యుయేషన్ డే కోసం టైమ్లాప్స్ వీడియోను కూడా రూపొందించాలని ప్లాన్ చేశాడు. ఈలోపు సరదాగా బ్లాక్చెయిన్ టెక్నాలజీ గురించి తెలుసుకుని అందులో తన సెల్ఫీలను ఆన్లైన్లో ఎన్ఎఫ్టీలుగా విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. తన సెల్ఫీలను ఎవరు కొంటారో చూద్దాం అని తమషాగా చేశాడు. సెల్ఫీని కేవలం మూడు డాలర్లు (రూ.223)గా కోట్ చేశాడు. కానీ, అతడు కూడా ఊహించని రేంజ్లో సెల్పీలకు డిమాండ్ పెరిగింది.
మరోవైపు క్రిప్టోకరెన్సీ ఈథర్ ఎఫెక్ట్తో ఒక్కో సెల్ఫీ రూ.60 వేలు పలికింది. ఈ క్రమంలో ఒక ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఘోజాలీ సెల్ఫీని ప్రమోట్ చేశారు. ఆ ప్రభావంతో ఘోజాలీ సెల్ఫీ అమ్మకాలు అమాంతం ఊపందుకున్నాయి. దీంతో ఘోజాలీ సుమారు రూ.7 కోట్లు పైనే సంపాదించగలిగాడు. ఏదిఏమైన సరదాగా తమాషాకి చేసిన పని అతన్ని కోటీశ్వరుడిగా చేయడం విశేషం.