ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్ దక్షిణ కొరియాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ దక్షిణ కొరియా ఆర్మీ దాడికి ప్రయత్నిస్తే, అప్పుడు ఆ ఆర్మీని అణ్వాయుధాలతో తుడిచిపెట్టేస్తామని కిమ్ యో జాంగ్ పేర్కొన్నది. ఇటీవల దక్షిణ కొరియా రక్షణ శాఖ చీఫ్ సు వూక్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా కిమ్ సోదరి తాజా వార్నింగ్ ఇచ్చింది. దక్షిణ కొరియా ఆ సాహసం చేస్తే అదో పెద్ద తప్పు అవుతుందని అన్నారు. రక్షణ చీఫ్ ఉన్మాదిగా మారి దాడులు గురించి మాట్లాడుతున్నట్లు ఆమె ఆరోపించారు. ఒక వేళ సౌత్ కొరియా సైనిక చర్యకు దిగితే, అప్పుడు తమ న్యూక్లియర్ దళం అనివార్యంగా వాళ్లను మట్టికరిపిస్తుందని కిమ్ యో అన్నారు. తమ సైనిక దళాలకు తగ్గ స్థాయిలో దక్షిణ కొరియా లేదని ఆమె పేర్కొన్నది.
ఈ ఏడాదిలో ఉత్తర కొరియా మిస్సైల్ పరీక్షలతో దడపుట్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే నార్త్ కొరియాలో ఉన్న ఏ టార్గెట్ను అయినా చేసుకునే సామర్థ్యం ఉన్న ఆయుధాలు తమ వద్ద ఉన్నట్లు దక్షిణ కొరియా రక్షణ శాఖ చీఫ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కిమ్ జాంగ్ సోదరి కిమ్ యో జాంగ్ స్పందించింది.