డిసెంబర్ 10 న తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో లండన్, పరిసర ప్రాంతాల చర్చిలకి సంబంధించిన వారితో పాటు తెలుగు ప్రజలు ఈస్ట్ లండన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు చర్చిల ప్రతినిధులతో పాటు, పిల్లలు ఏసుక్రీస్తును కీర్తిస్తూ పాటలు ఆలపించారు. సిస్టర్ జెమిమా దారా పర్యవేక్షణలో నియేసు క్రీస్తు జననంు నాటకాన్ని బాలలు అత్యంత శ్రద్ధతో ప్రదర్శించారు. యూకే లో పుట్టి పెరుగుతున్న పిల్లలు తెలుగులో ఈనాటికను ప్రదర్శించడం అందరిని అబ్బురపరిచింది.
ఈ కార్యక్రమంలో తాల్ ట్రస్టీలు గిరిధర్ పొట్లూరు, అనిల్ అనంతుల, కిషోర్ కస్తూరి, నవీన్ గాదంసేతిలతోపాటు తాల్ సభ్యులు వంశీమోహన్ సింగలూరి, శ్రీదేవి అల్లెద్దుల, మల్లేష్ కోట పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషిచేసిన రవి మోచెర్ల, రత్నాకర్ దారా తదితరులకు తాల్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
పాస్టర్ భరత్ క్రిస్మస్ ప్రాముఖ్యతను వివరించగా, పాస్టర్ డామినిక్, పాస్టర్ డానియల్ మరియు బ్రదర్ అజయ్ బైబిల్ ప్రాధాన్యతను వివరిస్తూ యేసుక్రీస్తుని స్తుతించారు. లండన్ మరియు యూకే లోని తెలుగువారి క్షేమం కోరుతూ ప్రార్థనలు చేసి, తెలుగు వారికి తాల్ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. చివరగా ప్రపంచ మానవాళి సంక్షేమం గురించి ప్రార్థనతో ఈ కార్యక్రమం ముగిసింది.