యనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో దారుణం జరిగింది. ఉద్యోగం ఇచ్చిన తోటి భారతీయుడినే మరో భారత ప్రవాసుడు కత్తితో పొడిచి చంపేశాడు. శాలరీ విషయంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ కాస్త ఇలా ఒకరి ప్రాణం తీసింది. కేరళ రాష్ట్రం మలప్పురంలోని చంగరంకుళంకు చెందిన యాసిర్ (38) అబుదాబిలో కలర్ వరల్డ్ అనే ఓ ప్రైవేట్ సంస్థను నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో రెండు నెలల కింద దగ్గరి బంధువైన మహమ్మద్ గసాని అనే వ్యక్తిని తన సంస్థలో గ్రాఫిక్ డిజైనర్గా నియమించుకున్నాడు. అయితే, గడిచిన కొన్నిరోజులుగా గసాని ప్రస్తుతం తనకు ఇస్తున్న శాలరీ కంటే ఇంకా ఎక్కువ కావాలని డిమాండ్ చేస్తూ యాసిర్తో గొడవ పడుతున్నాడు. రెండు రోజుల కింద కూడా ఇదే విషయమై ఇద్దరు ఆఫీస్లోనే ఘర్షణకు దిగారు. దాంతో గసాని తనతో పాటు తెచ్చుకున్న కత్తితో యాసిర్పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యాసిర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గసానిని అబుదాబి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మృతుడు యాసిర్కు గర్భవతి అయిన భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు. యాసిర్ స్వస్థలం చంగరంకుళంలో విషాదం అలుముకుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)