అమెరికాలో ఓ తెలుగు విద్యార్థికి అరుదైన గౌరవం లభించింది. సమాజంలో మార్పు కోసం వినూత్నంగా ఆలోచించే యువతను అమెరికాలో ప్రిన్సెస్ డయానా అవార్డుతో సత్కరిస్తారు. అమెరికాలో తెలుగు విద్యార్థి శ్రీనిహాల్ తమ్మన పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న కృషికి ఫలితంగా ఈ అవార్డు వరించింది. సమాజం కోసం ఆలోచించి మానవత్వంతో స్పందించిన నిహాల్ తమ్మన బ్యాటరీలు పర్యావరణానికి ఎంతో కీడు చేస్తున్నాయనేది తెలుసుకుని చలించిపోయారు. దీనికి రీ సైక్లింగ్ ఒక్కటే మార్గమని భావించి బ్యాటరీ రీసైక్లింగ్ను చిన్న వయసులోనే ఓ ఉద్యమంలా చేపట్టాడు. తన టోటి విద్యార్థుల సాయంతో ముందుగా ఇళ్లలో వినియోగించిన బ్యాటరీలను సేకరించి వాటిని రీసైక్లింగ్ చేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు దాదాపు 2,75,000లకు పైగా బ్యాటరీలను నిహాల్ రీసైక్లింగ్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. బ్యాటరీ రీసైక్లింగ్పై పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాడు.


ఈ సదస్సుల ద్వారా 1.25 కోట్ల మందిలో చైతన్యం కల్పించాడు. తెలుగు విద్యార్థి ఇలాంటి అవార్డు సాధించడం చరిత్రలోనే మొదటిసారని, ఇది కచ్చితంగా తెలుగవారంతా గర్వించద్గ విషయమని పలువురు ప్రశంసిస్తున్నారు. శ్రీనిహాల్ తమ్మనను ఇప్పటికే అనేక అవార్డులు వరించాయి. తాజాగా ప్రిన్సెస్ డయానా అవార్డు నిహాల్ కృషికి మరింత గుర్తింపు తెచ్చింది.
















