రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ రేసులో ఉన్న భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామి ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తాజాగా భారత్తో సంబంధాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ వంటి దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. చైనా నుంచి అమెరికా వాణిజ్య స్వాతంత్ర్యం పొందాలంటే, భారత్, ఇజ్రాయెల్, బ్రెజిల్, చిలీ లాంటి దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని వివేక్ రామస్వామి పేర్కొన్నారు. అమెరికా ఫార్మా రంగం చైనాపై ఆధార పడటం తగ్గించకోవడం కోసం ఇండియా, ఇజ్రాయెల్తో తమ సంబంధాలను మరింత విస్తరించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
కంప్యూటర్ చిప్స్ను తయారు చేసేందుకు వినియోగించే లిథియం లాంటి ఖనిజాలను దిగుమతి చేయడం కోసం చైనాకు బదులుగా భారత్, బ్రెజిల్, చిలీ వంటి దేశాలను ఆశ్రయించడం మంచిదంటూ సూచనలు చేశారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను తయారు చేయడానికి వినియోగించే ఖనిజాల కోసం అమెరికా ఎక్కువగా చైనాపైనే ఆధారపడాల్సి వస్తుందని తెలిపారు. దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాలపై అమెరికా అందించే సబ్సిడీల వల్ల పరోక్షంగా చైనాకు లబ్ధి వస్తోందని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీకి అవసరమైనటువంటి మినరల్స్ను భారత్, బ్రెజిల్, చిలీ లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చని సూచనలు చేశారు. అయితే చిప్స్ తయారీలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించడానికి జపాన్, దక్షిణ కొరియా లాంచి దేశాల వల్ల వాణిజ్య సంబంధాలను పునర్వ్యవస్థీకరించుకోవాలని తెలిపారు.