అభినవ్ గోమఠం హీరోగా, వైశాలిరాజ్ హీరోయిన్గా రూపొందిన చిత్రం మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా. కాసుల క్రియేటివ్ వర్క్స్ పతాకంపై తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వంలో భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 23న విడుదలైన ఈ సినిమా మంచి ఆదరణను రాబట్టుకుంటోంది. ఈ సందర్భంగా మేకర్స్ థ్యాంక్స్ మీట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత భవాని కాసుల మాట్లాడుతూ ఈ సినిమా విడుదల విషయంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. విడుదలై విజయవంతంగా ప్రదర్శింప బడుతుంటే కష్టం మొత్తం దూదిపింజలా ఎగిరిపోయినట్టు అనిపిస్తుంది అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.
దర్శకుడు మాట్లాడుతూ మా చిన్న సినిమాకు మీడియా అందిస్తున్న సహకారం మరువలేనిది. వాళ్లు భుజాల పై ఈ సినిమాను మోస్తున్నారు. రోజు రోజుకు సినిమా పట్ల ప్రేక్షకుల ఆదరణ పెరుగుతుంది. తప్పకుండా మా సినిమాను అందరూ చూసి ఎంకరైజ్ చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. నటుడు అభినవ్ గోమఠం మాట్లాడుతూ సినిమా విడుదల వరకు ఎంతో ఒత్తిడి వుండేది. ఫైనల్గా సినిమా పట్ల ప్రేక్షకుల స్పందన చూసి రిలాక్స్ అయ్యాను. నిర్మాత భవాని ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. అందరి శ్రమకు తగిన ప్రతిఫలం లభించిందని అన్నారు. ఈ సమావేశంలో హీరోయిన్ వైశాలి, రచయిత రాధాక్రిష్ణ, నటులు రోహన్రాయ్ ఇంకా ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.