తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష మలేషియాలో జరుగుతున్న అండర్-19 మహిళల ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. స్కాట్లాండ్తో జరిగిన సూపర్ సిక్స్ పోరులో త్రిష (59 బంతుల్లో 110 నాటౌట్, 13 ఫోర్లు, 4 సిక్సర్లు) 53 బంతుల్లోనే శతకం బాది ఈ టోర్నీలో మొట్టమొదటి సెంచరీ చేసిన క్రికెటర్గా తన పేరును రికార్డుల పుస్తకాలలో సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. త్రిషతో పాటు మరో ఓపెనర్ కమిలిని (42 బంతుల్లో 51, 9 ఫోర్లు) మెరవడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు చేసింది.
అనంతరం ఛేదనలో భారత బౌలర్ల ధాటికి స్కాట్లాండ్ 14 ఓవర్లలోనే 58 పరుగులకు చాపచుట్టేయడంతో టీమ్ఇండియా 150 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. లెఫ్టార్మ్ స్పిన్నర్లు అయూషి శుక్లా (4/8), వైష్ణవి శర్మ (3/5) ప్రత్యర్థి బ్యాటర్లను క్రీజులో నిలవనీయలేదు. బ్యాటింగ్లో దుమ్మురేపిన త్రిష (3/6) బంతితోనూ మెరిసి ఆల్రౌండ్ షోతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకుంది.
తానా తో బంధం :
త్రిష గొంగడి తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో జన్మించారు. రెండళ్ల వయసు నుంచే తండ్రి క్రికెట్ ఆడటం నేర్పించడంతో కేవలం తొమ్మిదేళ్ల వయసులోనే హైదరాబాద్ అండర్`16 జట్టులో భాగమైంది. 17 ఏళ్లకే 2023 ఐసీసీ అండర్ 19 ప్రపంచ మహిళా టీ20 క్రికెట్ కప్ గెలిచిన భారత జట్టులో ఆడి త్రిష గొంగడి అందరి మన్నలు పొందింది. అదే సంవత్సరం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)తో బంధం ఏర్పడిరది.
పేద కుటుంబానికి చెందిన త్రిష క్రికెట్ కోచింగ్, ఆట పరికరాలు, ఆరోగ్యం, ఫిట్నెస్ తదితర అవసరాలకు ఖర్చులు విపరీతంగా పెరగడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో క్రికెట్ పై ఇష్టాన్ని చంపుకోలేక ఆర్థిక సహాయం కోసం అప్పటి తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డని సంప్రదించారు. శశాంక్ యార్లగడ్డ కూడా స్పోర్ట్స్ పర్సన్ అవ్వడంతో త్రిష గొంగడికి సహాయం చేయడానికి తానా తరపున ఫండ్రైజర్ మొదలు పెట్టి నిధుల సమీకరణ చేశారు. ఆ ప్రాపెస్ లో త్రిష కు ఒక మంచి కార్పోరేట్ సంస్థ నుంచి స్పాన్సర్షిప్ వచ్చింది. తానా ఫండ్రైజర్ ద్వారా సేకరించిన నిధులతో త్రిష లాంటి ఇతర పేద క్రీడాకారులకు సహాయం చేయాలని నిర్ణయించి రంజీలు, ఇతరత్రా క్రికెట్ టోర్నమెంట్స్ ఆడుతున్న 9 మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన యువ పేద క్రీడాకారులకు త్రిష గొంగడి సమక్షంలో ప్రొఫెషనల్ ఇంగ్లీష్ విల్లో బ్యాట్స్ అందించి సహాయం చేశారు.