
హీరో నాని స్వీయ నిర్మాణ సంస్థ వాల్పోస్టర్ సినిమా ప్రజెంట్ చేస్తున్న చిత్రం కోర్ట్-స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకుడు. ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా, నాని సోదరి దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. నేడు ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా నిర్మాతలిద్దరూ పాత్రికేయులతో ముచ్చటించారు. దీప్తి గంటా మాట్లాడుతూ నాని, ప్రశాంతి ఈ స్క్రిప్ట్ను ఓకే చేశారు. ఆ తర్వాత నేను ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యాను. ప్రతీ రోజు సెట్లో ఉండేదాన్ని. పోక్సో చట్టం నేపథ్యంలో దర్శకుడు ఎంతగానో పరిశోధించి అద్భుతమైన స్క్రిప్ట్ను సిద్ధం చేశారు. ఈ కథలో ఎన్నో లేయర్స్ కనిపిస్తాయి. ప్రతి సన్నివేశం చాలా సహజంగా అనిపిస్తుంది.ప్రియదర్శితో పాటు రోహిణి, సాయికుమార్, శివాజీ వంటి సీనియర్ నటులు ఉండటం వల్ల కథలో మంచి ఎమోషన్ పండింది అని చెప్పారు.

మీట్ క్యూట్ వెబ్సిరీస్ తర్వాత తాను అమెరికా వెళ్లిపోయానని, కోర్ట్ సినిమా కోసమే మళ్లీ ఇండియా వచ్చానని, ప్రస్తుతం తన దగ్గర కొన్ని ఐడియాలున్నాయని, అన్నీ కుదిరితే డైరెక్షన్ చేస్తానని దీప్తి గంటా పేర్కొన్నారు. ప్రశాంతి తిపిర్నేని మాట్లాడుతూ వాల్పోస్టర్ బ్యానర్లో నాని, నేను ఇద్దరం కథలు వింటాం. నానినే తుది నిర్ణయం తీసుకుంటారు. కథల ఎంపికలో నాని జడ్జిమెంట్కు తిరుగుండదని మేము నమ్ముతాం. ఓ సాధారణ ప్రేక్షకుడి దృష్టికోణంలో ఆయన కథను చూస్తారు. ఈ సినిమా ప్రీమియర్స్కు అంతటా సూపర్ రెస్పాన్స్ వస్తున్నది. ప్రీమియర్షోస్కు కొందరు లాయర్స్ కూడా వచ్చారు. ఈ సినిమా విజయంపై పూర్తి కాన్ఫిడెంట్తో ఉన్నాం అని తెలిపారు.
