హీరో శ్రీ నందు నటించిన చిత్రం సైక్ సిద్ధార్థ. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. ఈనెల 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ యామిని భాస్కర్ మీడియాతో ముచ్చటించారు. ఈ సినిమాలో నేను స్వతంత్ర భావాలు కలిగిన బలమైన మహిళ పాత్రలో కనిపిస్తా. పర్ఫార్మెన్స్కు బాగా స్కోప్ ఉన్న క్యారెక్టర్. ఈ సినిమా తర్వాత మరిన్ని మంచి అవకాశాలొస్తాయనే నమ్మకం ఉంది అని చెప్పింది.

ఈ సినిమాలో తాను విడాకులు తీసుకున్న మహిళ పాత్రలో కనిపిస్తానని, తనకు ఓ బాబు కూడా ఉంటాడని, పర్ఫార్మెన్స్ పరంగా ఛాలెంజింగ్ రోల్ ఇదని చెప్పింది. ఈ సినిమాలో నా పాత్ర పేరు శ్రావ్య. తను ఓ విఫల బంధం నుంచి బయటపడి స్వతంత్రంగా జీవించాలనే ఆలోచనతో ఉంటుంది. అదే సమయంలో హీరోకి బ్రేకప్ జరుగుతుంది. అతను అన్నీ వదిలేసి బస్తీలో ఉండటానికి వస్తాడు. అక్కడ మా ప్రేమకథ మొదలవుతుంది. సహజత్వం కలబోసిన ప్రేమకథగా ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. క్యారెక్టర్ నచ్చితే ఓటీటీ సినిమాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా అని యామిని చెప్పింది.
















