ప్రస్తుతం నిస్తేజంగా మారిన దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) స్థానంలో ఒక కొత్త ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై పాకిస్థాన్, చైనా సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రాంతీయ సమగ్రత, అనుసంధానం కోసం ఓ కొత్త సంస్థ అవసరమని అంగీకారానికి వచ్చిన చైనా, పాక్ ఈ దిశగా చర్చలు సాగిస్తున్నాయని ఈ పరిణామంతో ప్రమేయమున్న దౌత్యపరమైన వర్గాలను ఉటంకిస్తూ తెలిసింది. భారత్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంకతో కూడిన సార్క్ స్థానంలో కొత్త సంస్థ ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

ఇటీవల చైనాలో కన్మింగ్లో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ పాల్గొన్నాయి. సార్క్లో సభ్యులైన ఇతర దేశాలను కూడా కొత్త సంస్థలోకి ఆహ్వానించాలని ఈ సమావేశంలో ఆ మూడు దేశాలు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే చైనా, పాకిస్థాన్తో తాము చేతులు కలపనున్నట్లు వచ్చిన వార్తలను బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వం తోసిపుచ్చింది. తాము ఎటువంటి పొత్తు కుదుర్చుకోవడం లేదని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రి ఎంటీ తౌహీద్ స్పష్టం చేశారు.















