భారత్ అధ్యక్షతన దేశరాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమ్మిట్లో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ కు అరుదైన గౌరవం దక్కింది. ఈ సదస్సులో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారుల కళాత్మకం ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు వెండి తీగతో ప్రత్యేకంగా రూపొందించిన అశోక చక్ర బ్యాడ్జీలు దేశాధినేతల సూట్పై మెరవబోతున్నాయి.తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ద్వారా కరీంనగర్ హస్తకళల సంక్షేమ సంఘంలోని సిల్వర్ ఫిలిగ్రీ నాలుగు నెలల క్రితమే కేంద్రం నుంచి ఈ తయారీ ఆర్డర్ను పొందింది. ఇందులో భాగంగానే సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు 200 అశోక చక్ర బ్యాడ్జీలను తయారు చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. 9-10 తేదీల్లో శిఖరాగ్ర సమావేశాలకు హాజరయ్యే ఆయా దేశాల ప్రధానులు, అధ్యక్షులు వేసుకొనే కోటుకు ఈ బ్యాడ్జీలను ధరింపజేయనున్నారు. అంతర్జాతీయ సదస్సు కోసం వెండి బ్యాడ్జీలను రూపొందించే అవకాశం రావడం పట్ల కరీంనగర్ హస్తకళల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గద్దె అశోక్కుమార్ హర్షం వ్యక్తం చేశారు.














