ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాని ఓం రౌత్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రామాయణం ఇతివృత్తంగా రూపొందించిన చిత్రమిది. రాముడి పాత్రను ప్రభాష్ పోషించగా, సీత పాత్రలో కృతి సనన్ నటించింది. లంకేశుడు పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషించారు. ఈ చిత్ర టీజర్ను చిత్ర బృందం ఆయోధ్యలో విడుదల చేసింది. భూమి కుంగినా నింగి చీలినా న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం అంటూ రాముడిగా ప్రభాస్ చెప్పే డైలాగ్తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 1:40 నిమిషాల నిడివి ఉన్న ఈ ప్రచార చిత్రంలో రామాయణంలోని కీలక ఘట్టాల్ని గ్రాఫిక్స్ హంగులతో అందంగా ఆవిష్కరించారు. నా ఆగమనం అధర్మ విధ్వంసం అంటూ టీజర్లో ప్రభాస్ చెప్పిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలో ప్రభాస్ మాట్లాడుతూ మొదట ఈ పాత్రలో నటించేందుకు భయపడ్డాను. అంకిత భావం, క్రమశిక్షణ, విశ్వాసంతో ఉండటం ఈ మూడు విషయాలను శ్రీరాముడి ప్రవర్తన నుంచి నేర్చుకోవచ్చు. శతాబ్దాలుగా మనం ఈ లక్షణాలను అనుసరించాలని చూస్తున్నా మనవల్ల కావడం లేదు. అందుకే మంన మనుషులు అయ్యాం. శ్రీరాముడు దేవుడు అయ్యారు అని అన్నారు. టీజర్ విడుదలకు ముందు రామమందిరాన్ని సందర్శించి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకుంది చిత్ర బృందం. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ బాషల్లో వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో నిర్మాత భూషణ్ కుమార్ పాల్గొన్నారు.














