అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ మరొక బాంబు పేల్చింది. అమెరికాలో ఎక్కువ కాలం ఉంటున్న విదేశీయులు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని హోమ్ శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. 30 రోజులకు మించి అమెరికాలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ ఫెడరల్ ప్రభుత్వం వద్ద తమ పూర్తి వివరాలు నమోదు చేయించుకోవాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హోమ్ శాఖ స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించినవారిపై నేరారోపణలు మోపి, జరిమానా విధించడంతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని హోమ్ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.

ఎటువంటి సమస్యలూ లేకుండా ఉండాలంటే వెంటనే అమెరికాను విడిచి వెళ్లడమే ఉత్తమ మార్గమని హోమ్ శాఖ సూచించింది. అమెరికాను వీడడానికి ఇదే సరైన సమయమని, సామాను సర్దుకుని స్వదేశానికి విమానం ఎక్కాలని హోమ్ శాఖ సూచించింది. ఎటువంటి నేర చరిత్రా లేనివారు ఇక్కడ సంపాదించుకున్న డబ్బుతో నిశ్చింతగా వెళ్లిపోవచ్చునని ఆ శాఖ అన్నది. ఒక వేళ ఎవరికైనా విమానం టిక్కెట్ కొనుగోలు చేసే స్తోమత లేకపోతే అమెరికా ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తుందని హోమ్ శాఖ సూచించింది.

నిబంధనలు పాటించనివారిని వెంటనే దేశం నుంచి బహిష్కరిస్తామని హోమ్ శాఖ హెచ్చరించింది. అంతే కాకుండా, బహిష్కరణ ఆదేశాలు అందుకున్న వారు ఒక్క రోజు ఎక్కువ ఉన్నా రోజుకు 998 డాలర్లు జరిమానా చెల్లించవలసి ఉంటుందని, సొంతంగా వెళ్లిపోకపోతే 1000 నుంచి 5000 డాలర్ల వరకు జరిమానా విధిస్తామని ఆ శాఖ తెలియజేసింది. భవిష్యత్తులో వారు చట్టపరమైన మార్గాల ద్వారా కూడా అమెరికాలోకి మళ్లీ ప్రవేశించే అవకాశం కోల్పోతారని హోమ్ శాఖ చ్చరించింది.
