రాజ్తరుణ్, మాల్వీ మల్హోత్ర, మన్నారా చోప్రా ముఖ్యతారలుగా నటిస్తున్న చిత్రం తిరగబడరసామీ. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకుడు. మల్కాపురం శివకుమార్ నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. హీరో, హీరోయిన్, రాజా రవీంద్రలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. దర్శకుడు మాట్లాడుతూ దర్శకుడిగా కొంత సమయం తీసుకుని కసితో చేసిన సినిమా ఇది. ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఎమోషన్ అన్ని అంశాలు ఈ చిత్రంలో వున్నాయి. కంప్లీట్ యూత్ఫుల్ ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్టైనర్గా చిత్రం అన్ని వర్గాలను అలరిస్తుందనే నమ్మకం వుంది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ఒక బంధాన్ని నిలుపుకోవడం కోసం భార్యభర్తలు, ప్రేమికులు ఎంత వరకూ వెళ్తారనేది చాలా వినోదాత్మకంగా చూపించాం.రవికుమార్ చౌదరి మంచి సబ్జెక్ట్తో చిత్రాన్ని చక్కగా తెరకెక్కిస్తున్నారు. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు.
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ తిరగబడరసామీ మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్. రవికుమార్ చౌదరి గారి గత సినిమాల్లానే యాక్షన్ కామెడీ రోమాన్స్ ఎక్కడా తగ్గకుండా వుంటాయి. ఇవాళ రేపటి తో మొత్తం షూటింగ్ పూర్తవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడ చివరి దశలో వున్నాయి. అతి త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెలాఖరున లేదా వచ్చే నెలలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. సినిమాని అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరూ థియేటర్ లో సినిమా చూసి ఎంజాయ్ చేయాలి. పైరసీని మాత్రం ప్రోత్సహించవద్దు అని కోరారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. జెబి సంగీతం అందిస్తున్నారు. జవహర్ రెడ్డి కెమెరామెన్ గా పని చేస్తున్నారు. బస్వా పైడిరెడ్డి ఎడిటర్, రవికుమార్ గుర్రం ఆర్ట్ డైరెక్టర్. భాష్యశ్రీ డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సమావేశం లో రాజా రవీందర్, డీఓపీ జవహర్ రెడ్డి, జబర్దస్త్ అప్పారావు, కమెడియన్ బద్రం, డైలాగ్ రైటర్ భాష్యశ్రీ పాల్గొన్నారు.