ఓ ఎన్నారై సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రం బార్మర్ జిల్లాలోని బుఢాతల గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. తన తల్లిని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు ఎవ్వరూ ఊహించని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా కోటీ రూపాయలు పెట్టి ఆ గ్రామంలో ఓ కొత్త పంచాయతీ భవనాన్ని నిర్మించారు. తన తల్లిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజల కోసం ఏదైనా చేయాల్సిన బాధ్యత తనమీద ఉందని ఎన్నారై నవల్ కిషోర్ వ్యాఖ్యానించారు. తన వ్యాపారమంతా విదేశాల్లోనే ఉన్నా కూడా గ్రామస్థులు తల్లిని గెలిపించారని ఆయన తెలిపారు. దీంతో ఈ విషయం తెలియగానే వారి కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. సకల హంగులు, అత్యాధునిక సౌకర్యాలతో పంచాయతీ భవనాన్ని నిర్మించారు. సర్పంచ్ వార్డు సభ్యుల సమావేశాల కోసం ఆ భవనంలో ఓ పెద్ద హాలును నిర్మించారు. భవనం సుందరీకరణలో భాగంగా పంచాయతీ చుట్టూ పెద్ద తోటను కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్నారైపై అక్కడి గ్రామస్థులు ప్రశంసల వర్షం కురిపించారు.














