ప్రతి అంతర్జాతీయ కంపెనీకి కేంద్రంగా మారుతున్న తెలంగాణకు మరో ప్రతిష్ఠాత్మక సంస్థ రానున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల వేదికగా పేరొందిన ప్లగ్ అండ్ ప్లే టెక్నాలజీ సెంటర్ అతిత్వరలో హైదరాబాద్లో అడుగుపెట్టనుంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో జరుగుతున్న యాంబిషన్ ఇండియా 2021 సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందంతో ప్లగ్ అండ్ ప్లే ప్రతినిధులు భేటీ అయ్యారు. డిసెంబర్ తొలివారంలో తమ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో సయిద్ అమీది మంత్రి కేటీఆర్ సమక్షంలో హైదరాబాద్లో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా భారత్లో కార్యకలాపాలు ప్రారంభిస్తారని ఈ భేటీ అనంతరం వారు ప్రకటించారు.
మొబిలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వ్యవసాయ సాంకేతికత, ఆరోగ్యం ట్రావెల్, ఫిన్టెక్ తదితర రంగాలపై ప్లగ్ అండ్ ప్లే ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించింది. హైదరాబాద్లో ఏర్పాటు చేసే కేంద్రం ద్వారా తొలుత మొబిలిటీ, ఐఓటీ, విద్యుత్, మౌలిక వసతుల వాతావరణంపై దృష్టి పెట్టి తర్వాతి దశలో పిన్టెక్, జీవ ఔషధ, ఆరోగ్య రంగాలకు కార్యకలాపాలు విస్తరిస్తామని సంస్థ ప్రకటించింది.
జర్మనీలోని స్టార్టప్ ఆటోబాన్ తరహాలో హైదరాబాద్ లో ఏర్పాటు చేసే ఆవిష్కరణల కేంద్రాన్ని కూడా నూతన సాంకేతిక భాగస్వామ్యాలకు చిరునామాగా రికార్డు సమయంలో పీఎన్పీ (ప్లగ్ అండ్ ప్లే) తీర్చిదిద్దనుంది. మొబిలిటీ రంగంలో పేరొందిన సంస్థలు, స్టార్టప్ల భాగస్వామ్యంతో స్టార్టప్ ఆటోబాన్ అతితక్కువ సమయంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ఇదే తరహాలో సియాటిల్ కేంద్రంగా పనిచేస్తున్న ట్రయాంగ్యుల్ ల్యాబ్స్ అనే సంస్థ భాగస్వామ్యం తో హైదరాబాద్లో ఏర్పాటు చేసే టెక్నాలజీ సెంటర్ ఐఓటీ, స్మార్ట్ సిటీస్ రంగాల్లో ఇంక్యుబేషన్ సెంటర్ను పీఅండ్పీ నడపనుంది. స్టార్టప్లు కార్పొరేట్ పెట్టుబడిదారులకు భారత్లో అతిపెద్ద, అత్యుత్తమ టెక్నాలజీ సెంటర్ను నిర్మించడమే తమ లక్ష్యంగా ఉంటుందని కేటీఆర్తో బేటీ అనంతరం పీఅండ్పీ ప్రతినిధి బృందం వెల్లడిరచింది.