అదానీ గ్రూపు మరో కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్లోని ముంద్రాలో రూ.34,900 కోట్ల వ్యయంతో చేపట్టాలనుకున్న పెట్రోకెమికల్ ప్రాజెక్టును నిలిపివేసింది. కచ్ జిల్లాలోని అదానీ పోర్ట్స్ ఆండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్(ఏపీసెజ్)లో బొగ్గు నుంచి పాలీ వినైల్ క్లోరైడ్(పీవీసీ) ఉత్పత్తి చేసే గ్రీన్ఫీల్డ్ ప్లాంట్ నిర్మించడానికి 2021లో అదానీ గ్రూపు ముంద్రా పెట్రోకెమ్ లిమిటెడ్ అనే కొత్త సంస్థను ఏర్పాటుచేసింది. ఏడాదికి 2,000 కిలో టన్నుల పీవీసీ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్ నిర్మించాలనుకుంది. ఇందుకుగానూ ఏడాదికి 3.1 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం పడుతుందని, దీనిని ఆస్ట్రేలియా, రష్యా, పలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు ప్రణాళికలు రచించింది. అయితే, అదానీ సంస్థలు స్టాక్ మానిపులేషన్, అకౌంటింగ్ అక్రమాలకు పాల్పడ్డాయని జనవరి 24న హిండెన్బర్గ్ సంస్థ నివేదిక ఇవ్వడంతో పరిస్థితి తారుమారైంది. ఏకంగా అదానీ గ్రూపులకు చెందిన 140 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఆవిరైంది. అదానీ గ్రూపులకు విపరీతమైన అప్పులు ఉన్నాయనే ఆరోపణలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రుణాల చెల్లింపు, నిధుల స్థిరీకరణపై దృష్టి సారించేందుకు పెట్రోకెమికల్ ప్రాజెక్టును నిలిపివేయాలని ఆదానీ గ్రూపు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.
