
ఉన్నత చదువుల కోసం అగ్ర రాజ్యం అమెరికా వెళ్లి మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. దుండగుడు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రానికి చెందిన గంప రాఘవులు-రమాదేవి దంపతులకు కొడుకు ప్రవీణ్(27), కుమార్తె ఉన్నారు. కుమారుడు ప్రవీణ్ కొంతకాలం కిందట ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ విస్కాన్సిన్ మిల్వాంకిలో నివాసం ఉంటున్నాడు. అక్కడే యూనివర్సిటీలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఖర్చుల కోసం ఓ స్టార్ హోటల్లో పార్ట్టైం జాబ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ప్రవీణ్ నివాసం ఉండే ఇంటికి సమీపంలోని బీచ్ దగ్గర తాజాగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో గాయపడ్డ ప్రవీణ్ అక్కడికక్కడే మరణించారు. ప్రవీణ్ మరణవార్తను అతని స్నేహితులు ఇండియాలోని కుటుంబసభ్యులకు తెలియజేశారు. దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రవీణ్ మృతితో కేశంపేట మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
