అద్భుత నిర్మాణాలతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న చైనా త్వరలో మరో ఇంజినీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించనున్నది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ బ్రిడ్జిని ఈ జూన్లో ప్రారంభించనున్నది. గుయ్ఝౌలోని బీపన్ నదిపై 2,050 అడుగుల ఎత్తులో ఈ వంతెనను నిర్మించారు. రెండు మైళ్ల పొడవైన ఈ వంతెన ఫ్రాన్స్ రాజధాని పారిస్లోని ఈఫిల్ టవర్ కంటే 200 మీటర్లు ఎత్తుగా ఉంటుంది. 2022లో ప్రారంభమైన ఈ వంతెన నిర్మాణం మూడేండ్లలో పూర్తయింది. అందుకు 216 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ.2,427 కోట్లు) ఖర్చయింది.

ఈ వంతెన నిర్మాణానికి దాదాపు 22 వేల మెట్రిక్ టన్నుల ఉక్కును వినియోగించారు. ఇది మూడు ఈఫిల్ టవర్లకు సమానం. గతంలో హువాజియాంగ్ లోయ చుట్టూ తిరిగి వచ్చేందుకు గంట సమయం పట్టేదని, ఇప్పుడు ఈ వంతెన నిర్మాణంతో ఆ ప్రయాణం నిమిషంలోనే పూర్తవుతుందని చైనా అధికారులు చెప్తున్నారు. చైనా ఇంజినీరింగ్ సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు గుయ్ఝౌను ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా మార్చాలన్న లక్ష్య సాధనకు ఈ సూపర్ ప్రాజెక్టు ఊతమిస్తుందని చైనా రాజకీయవేత్త జాంగ్ షెంగ్లిన్ తెలిపారు.
