ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎట్టకేలకు అంతర్జాతీయ సరిహద్దులను పూర్తి స్థాయిలో తెరవనుంది. కొవిడ్ ఆంక్షల సడలింపులో భాగంగా పర్యాటకులు, బిజినెస్ ప్రయాణికులతో సహా వ్యాక్సినేషన్ పూర్తయినవారందరిని ఫిబ్రవరి నుంచి దేశంలోకి అనుమతించనుంది. అయితే ఫిబ్రవరి 21 నుంచి టీకాలు పూర్తయిన వీసా హోల్డర్లందరూ తమ దేశానికి రావొచ్చని ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ ప్రకటించారు. సందర్శకులందరూ తప్పనిసరిగా టీకా ఆధారాలు చూపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే టీకా ఎందుకు వేయించుకోలేదో వైద్యపరమైన కారణాలు చూపగలిగే వారికి మినహాయింపు ఉంటుందని తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ఆస్ట్రేలియా 2020 మార్చి నుంచి అత్యంత కఠినమైన ప్రయాణ ఆంక్షలను కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. స్థానికంగా వ్యాక్సినేషన్ శాతం పెరగడంతో గతేడాది నవంబర్లో సరిహద్దు ఆంక్షలను కాస్త సడలించింది. అయితే, ఆ సమయంలో అంతర్జాతీయ విద్యార్థులు, నైపుణ్యం కలిగిన వలసదారులకు ప్రాధాన్యం ఇచ్చింది.














