బోనీ కపూర్ ఫ్యామిలీకి ఇటీవల యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా ప్రకటించిన విషయం తెలిసిందే. బోనీ కపూర్తో సహా ఆయన నలుగురు పిల్లలు ఖుషీ కపూర్, జాన్వీ కపూర్, అర్జున్ కపూర్, అన్షులా కపూర్లకు గోల్డెన్ వీసా మంజూరు చేసింది. దుబాయ్లో జరిగిన ఓ కార్యక్రమంలో అక్కడి అధికారులతో బోనీ కపూర్ తన ఇద్దరు కూతుళ్లు ఖుషీ కపూర్, జాన్వీ కపూర్లతో కలిసి గోల్డెన్ వీసాల అందుకున్నారు. బోనీ కపూర్ మరో ఇద్దరు పిల్లలు అర్జున్ కపూర్, అన్షులా కపూర్ మాత్రం ఈ కార్యక్రమానికి వెళ్లలేదు. అర్జున్ కపూర్ తన బిజీ షెడ్యూల్ కారణంగా దుబాయ్ వెళ్లలేకపోయారని తెలిసింది. అలాగే అన్షులా కూడా ఇతర కారణాలతో ఈ కార్యక్రమానికి వెళ్లలేకపోయింది. తన పుట్టినరోజు సందర్భంగా బోనీ కపూర్ కూతుళ్లు జాన్వీ, ఖుషీ కపూర్తో కలిసి వీసాలను అందుకున్నారు.
కళాకారులను పెట్టుబడిదారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దుబాయ్ ప్రభుత్వం 2019 నుంచి గోల్డెన్ వీసాలు అందిస్తోంది. భారత్ నుంచి ఇప్పటివరకు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు యూఏఈ ఇచ్చే ఈ గోల్డెన్ వీసాను అందుకున్న సంగతి తెలిసిందే.














