ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సహకారంతో మైక్రోస్కాప్ పరికరాలు, పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించారు. విద్యార్థులకు బోధనా పరికరాలు, కంప్యూటర్లు అందించవల్సిందిగా పొట్లూరి రవిని అభ్యర్థించగా వెంటనే స్పందించారు. విద్యార్థులకు మైక్రోస్కోపులు, స్టడీ మెటీరియల్స్ అందించారు. వీటితో పాటే కంప్యూటర్లని కూడా పది రోజుల్లో అందిస్తామని తెలిపారని పాఠశాల బయాలజీ ఉపాధ్యాయుడు గోకారి తెలిపారు. తానా మహాసభల కన్వీనర్ పొట్లూరి రవి మాట్లాడుతూ కప్పట్రాళ్ల విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడానికి కృషి చేస్తామని అన్నారు. పాఠశాల విద్యార్థులకు ఎన్నారై విద్యార్థులతో ఆన్లైన్లో అనుసంధానం చేసి అధునిక సాంకేతిక విద్యను బోధించడానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి సహకరించి వాసుబాబు గోరంట్ల, రామ్ చౌదరిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై ఫౌండేషన్ కో ఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్, పారిశ్రామికవేత్త అనంత నాయుడు పాల్గొన్నారు.