ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్నచిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం. ఈ చిత్రంతో జాన్వీ కపూర్ తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. ప్రస్తుతం గోవాలో యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయని, వీటికోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ పనిచేస్తున్నారని చిత్ర బృందం పేర్కొంది. ఈ షెడ్యూల్ అనంతరం కర్ణాటకలోని గోకర్ణలో కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతున్న ట్లు సమాచారం. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతంలోని తన ప్రజలను కాపాడుకోవడానికి ఓ ధీరోదాత్తుడైన వ్యక్తి చేసే పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తం. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదలకానుంది.