
సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. పెంచిన సుంకాలు మార్చి 4 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక భారత్ పై విధించిన ప్రతీకార సుంకాలు వచ్చే నెల నుంచి అమలు కానున్నాయి.

భారత్, చైనా సహా పలు దేశాలపై ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేయనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సెషన్లో ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పదవి చేపట్టిన తర్వాత తాను చేసిన పనులు, సాధించిన విజయాల గురించి వివరించారు. ఇదే మీటింగ్లో భారత్, చైనా సహా పలు దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలు వచ్చే నెల 2 నుంచి అమలు చేస్తామని వెల్లడించారు.
