Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కీలక నిర్ణయం…విదేశీ విద్యార్థులపై

అమెరికా  అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత,  అక్కడి విదేశీ విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎట్నుంచి ఏ ముప్పు వచ్చి మీదపడుతుందోనని వారంతా బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. ఈ క్రమంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ కొందరు విదేశీ విద్యార్థులపై ట్రంప్‌ యంత్రాంగం బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ట్రంప్‌ యంత్రాంగం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. విదేశీ విద్యార్థులపై నిఘా పెట్టేందుకు ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిసింది. ఉగ్రవాద గ్రూపులకు మద్దతిస్తున్న విదేశీ విద్యార్థులను గుర్తించడంతోపాటు,  సోషల్‌ మీడియాలో వారికి అనుకూల పోస్టులు పెడుతున్న వారిని గుర్తించేందుకు ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఏఐ టెక్నాలజీతో అంతర్జాతీయ విద్యార్థులపై నిఘా పెట్టే ఈ కార్యక్రమానికి విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో నాయకత్వం వహిస్తున్నారని విదేశాంగ శాఖ సీనియర్ అధికారులు తెలిపారు. 2023 అక్టోబర్‌ 7న హమాస్‌ ఇజ్రాయెల్‌పై దాడి చేసిన నాటినుంచి ఇప్పటివరకు వారికి మద్దతుగా ఎవరెవరు సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్ట్‌లు చేశారు, ఎవరు వాటిని లైక్‌, షేర్‌ చేశారనే విషయాలు తెలుసుకోవడానికి విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను స్కాన్‌ చేస్తున్నట్లు తెలిసింది.

Social Share Spread Message

Latest News