తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి కుటుంబ సభ్యులతో ఉన్న విజువల్ చూసి ప్రవాసులు కన్నీటి పర్యంత మయ్యారు. చంద్రబాబు నోటివెంట వెలువడిన మాటలు, ఏమి తమ్ముళ్లు ఎలా ఉన్నారు అన్న మాట చెవినపడగానే ప్రవాసులు పులకించిపోయారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలైనారన్న సంతోషం, అక్రమకేసులలో 50 రోజులకు పైబడి నిర్బంధించారన్న బాధ కలగలిసిన ఉద్వేగం అందరి ముఖాలలో ప్రతిభింబించింది.


ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్పై విడుదల సందర్భంగా ఖతార్లో టీడీపీ ఆధ్వర్యంలో ప్రవాసులు సమావేశం నిర్వహించారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు అరెస్టు జరిగిన రోజు నుంచి జైలు నుంచి విడుదలయ్యే వరకు జరిగిన పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఎంతో మంది విద్యార్థులకు ఉపయోగపడే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయడం తప్పా? అని సమావేశంలో పాల్గొన్నవారు ప్రశ్నించారు. అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షాలపై పోలీసు వ్యవస్థను ప్రయోగించడం, పెత్తందారీతనం అవుతుందని, ప్రజాస్వామ్యం కాదని, ఈ తరహా చర్యలు ప్రజాస్వామ్య మనుగడకు గొడ్డలిపెట్టని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విపరీత పోకడల గురించి విద్యావంతులు, మేధావులు, ప్రజాస్వామ్య వాదులు ప్రశ్నించాలని కోరారు.
















