ఏడు దశాబ్దాలకు పైగా బ్రిటన్ సామ్రాజ్య సింహాసనంపై తిరుగులేని రాణిగా వెలుగొందిన ఎలిజబెత్`2 శకం ముగిసింది. క్వీన్ ఎలిజబెత్`2కు బ్రిటన్ తో పాటు ప్రపంచం యావత్తూ తుది వీడ్కోలు పలికింది. ప్రపంచ నేతలు, పలు దేశాల రాజులు, రాణులతో సహా దాదాపు 2 వేల మంది ప్రముఖుల సమక్షంలో లండన్లోని వెస్టుమినిస్టర్ అబ్బే చర్చి ఆవరణలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ముగిశాయి. బ్రిటన్ దేశవ్యాప్తంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఊరేగింపు కార్యక్రమంలో ఛార్లెస్ కుమారులు విలియం, హ్యారీ, ప్రిన్సెస్ అన్నే, యవరాజులు ఆండ్రూ, ఎడ్వర్డ్, విలియం పిల్లలు ప్రిన్స్ జార్జి, ప్రిన్సెస్ చార్లెట్, రాజ వంశీయులు పాల్గొన్నారు. రాణి ఎలిజబెత్ అంత్యక్రియాల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదితరులు పాల్గొన్నారు. ఎలిజబెత్ అంత్యక్రియలు వీక్షించేందుకు బ్రిటన్తో పాటు ఇతర దేశాల్లో ఏర్పాటు చేసిన స్క్రీన్ల వద్ద లక్షలాది మంది ప్రజలు గుమిగూడారు.