అమెరికాలోని డల్లాస్లో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపాడ్) ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల నిర్వహణకు డల్లాస్ పరిధిలోని ఫ్రిస్కో పట్టణంలో గల డాక్టర్ పెప్పర్ ఎరెనా స్టేడియం వేదికగా నిలిచింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలను నిర్వహించి, తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. బతుకమ్మ పాటలకు మహిళలు డ్యాన్సులు చేసి, అందరిలో హుషారును నింపారు. బొడ్డెమ్మ ఆడారు. ఆటాపాటలతో స్టేడియం దద్దరిల్లిపోయింది. అమ్మవారే కదిలివచ్చారా అన్నట్టుగా నవదుర్గ వేషధారణతో అమ్మాయిల ఊరేగింపు వైభవోపేతంగా సాగింది. నాలుగు గంటల పాటు సాగిన సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం బతుకమ్మ వేడుకలు మొదలయ్యాయి. సినీనటి రీతూవర్మ సందడి చేశారు. ఈ వేడుకలకు దాదాపు 15 వేల మంది తెలంగాణ ప్రజలు హాజరై, విజయవంతం చేశారు. ఇక ఈ వేడుకలకు పొరుగు రాష్ట్రాలైన ఓక్లహామా, కాన్సాస్, ఆర్కన్సాన్లో ఉంటున్న తెలుగువారందరూ హాజరయ్యారు.
అనంతరం విజయదశమి వేడుకలను నిర్వహించారు. శమీపూజ చేశారు. అలయ్ బలయ్ తీసుకుని సొంతగడ్డపై పండుగ చేసుకున్న ఆనందాన్ని పంచుకున్నారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ బృందం పాటలు అందర్నీ ఉర్రుతలూగించాయి. గాయకులు లిప్సికా, రోల్ రైడా, ధనుంజయ్ తదితరులు తమ పాటలతో అదరగొట్టారు.టీపాడ్ ఫౌండేషన్ కమిటీ చైర్మన్ అజయ్ రెడ్డి, రఘువీర్ బండారు, జానకి రామ్ మందాడి, రావుకల్వల, అధ్యక్షుడు రమణ లష్కర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్ ఇంద్రాణి పంచెర్పుల, కోఆర్డినేటర్ పాండు పాల్వాయి, పవన్ గంగాధర, అశోక్ కొండాల,రామ్ అన్నాడీ, గోలి బూచి రెడ్డి, సుధాకర్ కలసాని కార్యక్రమం ఆసాంతం విజయవంతమయ్యేలా, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న డల్లాస్లోని తెలుగు వారందరికీ TPAD నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.














