అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కాస్త అదుపులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా కొత్త కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ప్రయాణాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు సడలించింది. విదేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులకు 7 రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలన్న నిబంధనను తొలగించింది. అంతేకాకుండా ఒమిక్రాన్ ముప్పు ఎదుర్కొంటున్న దేశాలతో రూపొందించిన ఎట్ రిస్క్ కేటగిరీని కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దేశంలోకి వచ్చాక వారు 14 రోజుల పాటు స్వీయ పర్యవేక్షణలో ఉండాలి తన ఆరోగ్య స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించుకోవాలి. ఈ నిబంధనలు ఫిబ్రవరి 14 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఈ మార్గదర్శకాల ప్రకారం విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు సువిధ పోర్టల్లో సెల్ఫ్ డిక్లరేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ప్రయాణానికి ముందు (72 గంటల దాటకూడదు) చేయించుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష తాలూకు ఫలితాల్ని అప్లోడ్ చేయాలి. నెగెటివ్ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్కు బదులుగా కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నట్టు తెలిపే ధ్రువీకరణ పత్రాలను కూడా అప్లోడ్ చేయవచ్చు. అయితే ఈ సౌలభ్యం ప్రభుత్వం పేర్కొన్న 72 దేశాల వారికి మాత్రమే అందుబాటులో ఉంది. తాజాగా ఆ నిబంధనను ఎత్తివేస్తూ మార్గదర్శకాలు జారీ చేశారు.