భారత్లో తమ వీసాల వెయిటింగ్ టైమ్ చాలా వరకూ తగ్గించేందుకు అమెరికా పూర్తి స్థాయిలో యత్నిస్తోంది. ఈ క్రమంలో తమ క్యాన్సులర్ స్థాయి అధికారులను భారతదేశానికి పంపించడం, ఇతరత్రా ఓవర్సీస్ ఎంబస్సీలను ఇండియా వీసా దరఖాస్తుదారుల కోసం జర్మనీ, థాయ్లాండ్లలో కూడా ప్రారంభించడం జరుగుతుందని అమెరికా వీసాల సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అమెరికా వీసా అపాయింట్మెంట్ల కోసం భారతీయలు చాలా కాలం వేచి ఉండాల్సి వస్తోంది. కరోనా వైరస్ సంబంధిత ఆంక్షల తొలిగింపుల తరువాత అమెరికా వీసాలకోసం అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్న దేశాలలో ఇండియా ఒక్కటిగా ఉంది.
వెయిటింగ్ పరిమితి ఎక్కువ కావడం వల్ల భారతదేశంలోని వీసా దరఖాస్తుదార్లలో ఆందోళన పెరిగిపోతోంది. ప్రత్యేకించి బి1(బిజినెస్), బి2 (టూరిస్టు) కేటగిరిల్లో అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకునే వారు చిక్కులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది అక్టోబర్ దశలో తొలిసారి బి1/బి2 దరఖాస్తుదారులకు ఇండియాలో నిరీక్షణ గడువు దాదాపు మూడు సంవత్సరాలు . ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నామని, దీనిని గణనీయంగా తగ్గించేందుకు అన్ని విధాలుగా పలు స్థాయిల్లో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరోవైపు భారత్లో బిజినెస్ వీసాల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు పలు చర్యలను తీసుకుంటున్నామని, ఈ దిశగా ఇప్పటికే ప్రగతిని సాధించామని అమెరికా పేర్కొంది. భారత్లో తమ సిబ్బందిని సైతం గణనీయంగా పెంచినట్లు అమెరికా ప్రపంచమార్కెట్ల వాణిజ్య విభాగ సహాయ కార్యదర్శి అరుణ్ వెంకటరామన్ స్పష్టం చేశారు.