శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు లంక ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా అవసరమైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆకర్షించేందుకు శ్రీలంక గోల్డెన్ ప్యారడైజ్ వీసా ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. ఈ వీసాతో శ్రీలంకలో నిసించడంతో పాటు వ్యాపారం చేసుకోవచ్చు. గోల్డెన్ ప్యారడైజ్ వీసా ప్రోగ్రామ్ కింద, విదేశీ పౌరులు కనీసం భారతీయ కరెన్సీలో రూ.76.5 లక్షలు డిపాజిట్ చేస్తే 10 సంవత్సరాల పాటు శ్రీలంకలో నివసించేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ఇదే సమయంలో 75వేల డాలర్లు వెచ్చించి అపార్ట్మెంట్ కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిన వారికి ఐదు సంవత్సరాలు మంజూరు చేసేందుకు సైతం లంక ప్రభుత్వం ఆమోదించింది. అయితే, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని దేశం ఎదుర్కొంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పథకం ఎంతో సహాయపడుతుందని శ్రీలంక కేంద్ర మంత్రి నలక గోదాహేవా పేర్కొన్నారు.