ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ప్రధాని మోడీ కి లేఖ రాశారు. రష్యా దాడితో సంక్షోభంలో చిక్కుకుపోయిన ఉక్రెయిన్ మానవతా సాయం అందించాలన్నారు. ఈ లేఖ గురించి భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఏడాదికి పైగా ఉక్రెయిన్ దేశం రష్యా దురాక్రమణను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ ఉపమంత్రి ఎమినే జపరోవా భారత్లో పర్యటిస్తున్నారు.

ప్రధాని మోడీని ఉద్దేశించి జెలెన్స్కీ రాసిన లేఖను ఆమె విదేశాంగ శాఖకు అందించారు. వైద్యసామాగ్రి వంటి అదనపు మానవతాసాయం అందించాలని అందులో కోరారు. అందుకు భారత్ ముందుకు వచ్చిందని వెల్లడిస్తూ మన విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షి లేఖి స్పందించారు. అలాగే ఉక్రెయిన్ పునర్నిర్మాణం భారత సంస్థలకు ఓ అవకాశమని జపరోవా తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్ నుంచి ఆమె మరింత సహకారాన్ని కోరారు.మోడీ, ఇతర ఉన్నతాధికారులు తమ దేశంలో పర్యటించాలని అభ్యర్థించారు. అయితే ఇతర దేశాలతో భారత్కు ఉన్న సంబంధాల విషయంలో సూచనలు చేసే స్థితిలో తమ దేశం లేదన్నారు.
















