రెండు దేశాలతో వాణిజ్యం నిలిపివేస్తానని బెదిరించి భారత్, పాకిస్థాన్ను కాల్పుల విరమణకు ఒప్పించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వైట్ హౌస్లో విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ మీతో చాలా పెద్ద మొత్తంలో వాణిజ్యం చేయనున్నామని ఆ రెండు దేశాలకు చెప్పానన్నారు. ఇక యుద్ధం ఆపెయ్యండి. మీరు ఆపేస్తే మనం వాణిజ్యం చేద్దాం. మీరు ఆపకపోతే మాతో ఇక మీరు ఎటువంటి వాణిజ్యం చేయలేరు అని భారత్, పాక్ను బెదిరించానని ట్రంప్ తెలిపారు. హఠాత్తుగా ఆ రెండు దేశాలు కూడా తాము కూడా యుద్ధం ఆపేయాలని ఆలోచిస్తున్నట్టు చెప్పాయని ఆయన అన్నారు. ఆ రెండు దేశాల నిర్ణయాలపై వాణిజ్యం బలమైన ప్రభావం చూపిందని ఆయన చెప్పారు.చాలా కారణాలు ఉండొచ్చు. కాని అందులో వాణిజ్యం చాలా ముఖ్యమైనది అని ట్రంప్ వెల్లడించారు.

తాను జోక్యం చేసుకున్నందువల్లే రెండు దేశాల మధ్య అణు యుద్ధం తప్పిందని తాను భావిస్తున్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. అణు యుద్ధాన్ని మేము ఆపాం. అదో ఘోరమైన అణు యుద్ధం అయ్యేదని నేను భావిస్తున్నాను. లక్షలాది ప్రజలు మరణించి ఉండేవారు అని ట్రంప్ తెలిపారు. భారత్, పాక్తో అమెరికా పెద్ద ఎత్తున వాణిజ్యం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. భారత్తో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే పాకిస్థాన్తో కూడా చర్చలు ప్రారంభమవుతాయని ఆయన అన్నారు. రెండు దేశాలు సంక్షోభాన్ని పరిష్కరించుకున్న విధానాన్ని చూసి తాను గర్విస్తున్నానని ఆయన తెలిపారు. ఆ రెండు దేశాలలోని నాయకత్వం స్థిరంగా, శక్తివంతంగా ఉందని చెప్పారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోగల వివేచన కూడా వారిలో ఉందని ఆయన అన్నారు.
