అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థిని సుశ్రూణ్య కోడూరు పిడుగుపాటుకు గురై కోమాలోకి వెళ్లింది. బ్రెయిన్ డ్యామేజీ కావడంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. అయితే, ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఆమెకు వెంటిలేటర్ను తొలగించినట్లు వెల్లడించారు. గత వారం నుంచి వెంటిలేరట్ అవసరం లేకుండా ఆమె శ్వాస తీసుకుంటున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. నిజంగా అద్భుతమే జరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో వెంటిలేటర్ సదుపాయాన్ని తొలగించాం. వైద్యుల బృందం నిరంతరం సుశ్రూణ్యను పర్యవేక్షిస్తున్నారు అని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
ఆమె కుటుంబ సభ్యులకు వీసా లభించడంతో వచ్చే వారం వారు హైదరాబాద్ నుంచి యూఎస్ చేరుకుంటారని ఆమె బంధువు సురేంద్ర కుమార్ కోతా చెప్పారు. భారత్కు చెందిన 25 ఏళ్ల సుశ్రూణ్య యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాస్టర్స్ చేస్తోంది. ఆమె కొంతమంది స్నేహితులతో కలిసి స్థానికంగా ఉండే శాన్ జాసింటో మాన్యుమెంట్ పార్క్ కు వెళ్లింది. అక్కడి ఓ కొలను వెంబడి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అప్పటికే వాతావరణం ముసురుపెట్టి చిన్నగా వర్షం మొదలైంది. క్రమంగా పెరిగిన వర్షం ఉరుములు, మెరుపులతో జడివానగా మారింది. అదే సమయంలో ఊహించని విధంగా సుశ్రూణ్యపై పిడుగుపడింది. దాంతో ఆమె పక్కనే ఉన్న కొలనులో పడిపోయింది. ఆ సమయంలో ఆమె గుండె 20 నిమిషాల పాటు ఆగిపోయింది. దాంతో రక్తప్రసరణ నిలిచిపోవడంతో మెదడు దెబ్బతిని కోమాలోకి వెళ్లినట్లు ఆమెను పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఇక అప్పటి నుంచి ఆమెకు వైద్యం కొనసాగుతుంది.