పహల్గాం లో కాల్పులకు తెగబడి అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాద సంస్థలపై దాడిచేసే హక్కు భారత్కు పూర్తిగా ఉందని బ్రిటన్ ఎంపీ ప్రీతి పటేల్ అన్నారు. యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్లో భారత్కు మద్దతుగా ఎంపీ ప్రీతి తన గళం వినిపించారు. ఆపరేషన్ సిందూర్ ను సమర్థించారు.ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ బుధవారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేసింది. ఈ దాడులపై ఎంపీ ప్రీతి పటేల్ అక్కడి హౌస్ ఆఫ్ కామన్స్లో మాట్లాడారు. ఈ సందర్భంగా పహల్గాం బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఉగ్రవాదుల చర్య కారణంగా భారత్లో ఇప్పటికే ముంబై, ఢిల్లీ దెబ్బతిన్నాయని, ఇప్పుడు ఆ జాబితాలో పహల్గాం చేరిందని అన్నారు.

పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులను అన్యాయంగా, క్రూరంగా చంపేశారు. ఈ దాడిలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇది ఉగ్రవాద చర్య. భారత్లో ఉగ్రవాద చర్యల కారణంగా దెబ్బతిన్న ముంబై, న్యూఢిల్లీల జాబితాలో ఇప్పుడు పహల్గాం కూడా చేరింది. ఆత్మరక్షణ కోసం పోరాడే హక్కు భారత్కు ఉంది. అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైన పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలనే భారత్ లక్ష్యంగా చేసుకుంది. యూకే, భారత్ల మధ్య దీర్ఘకాలిక భద్రతా సహకార ఒప్పందాలు ఉన్నాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్కు బ్రిటన్ ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలి అని ఆమె పిలుపునిచ్చారు.
