అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై కొరడా ఝళిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అమెరికా నుంచి తరలిస్తున్న మధ్య ఆసియా, భారత అక్రమ వలసదారులను తమ దేశంలోకి తీసుకుంటున్నట్లు, కోస్టారికా దేశం ప్రకటించింది. అమెరికా నుంచి తరలిస్తున్న 200 మంది అక్రమ వలసదారులను తమ దేశంలోకి తీసుకొనేందుకు కోస్టారికా ప్రభుత్వం అంగీకరించింది. వీరిలో మధ్య ఆసియా, భారత్కు చెందిన వారు ఉన్నారు అని కోస్టారికా అధ్యక్ష కార్యాలయం అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.
ఈ వలసదారులను ఓ కమర్షియల్ ఫ్లేట్ ద్వారా కోస్టారికాకు చేర్చుకొని, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అక్రమ వలసదారుల శిబిరంలో ఉంచుతారు. ఇది పనామా సరిహద్దు సమీపంలో ఉంది. పనామా, గ్వాటెమాల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్న మూడో దేశంగా కోస్టారికా నిలిచింది. ఇప్పటికే పనామా తొలి బ్యాచ్లో చైనా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్కు చెందిన వలసదారులను తమ దేశంలోకి తీసుకోగా, గ్వాటెమాలా ఇంకా అమెరికా నుంచి వలసదారులను తరలించలేదు. ఇక అమెరికా నుంచి భారత వలసదారులు పెద్ద ఎత్తున తిరిగి స్వదేశానికి వస్తున్నారు. ఇప్పటికే మూడు విమానాల్లో వలసదారులు భారత్కు చేరుకోగా, వెనక్కివచ్చిన వారి వివరాలను అధికారులు సేకరించి తమ స్వస్థలాలకు పంపిస్తున్నారు.
