అగ్రరాజ్యం అమెరికాలో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇండియన్ బిజినెస్ అసోసియేషన్(ఐబిఎ), ఇండియా డే పరేడ్ ను ఘనంగా నిర్వహించింది. 77వ భారత స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా న్యూజెర్సీ ఎడిషన్ ప్రాంతంలోని ఓక్ట్రీ రోడ్లో ఇండియా డే పరేడ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు జాతీయ జెండాలను చేతబట్టి భారతమాతకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా స్టార్ హీరోయిన్ మిల్కీబ్యూటీ తమన్నా భాటియా పాల్గొన్నారు.
భారతమాత, స్వాతంత్ర్య యోధుల వేషాధారణలో ఆకట్టుకున్నారు. ఆటపాటలతో అలరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా డప్పు, వాయిద్యాలతో, ఆట పాటలతో పరేడ్లో పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. పరేడ్ కు వచ్చిన ప్రవాస భారతీయులు ఒకరికొకరు స్వాత్రంత్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇక ఈ పరేడ్లో భాగంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా శకటాలను ప్రదర్శించారు. భారీ జాతీయ జెండాలతో ఊరేగింపు నిర్వహించడం వంటి కార్యక్రమాలతో అమెరికాలోని న్యూజెర్సీ ప్రాంతమంతా మువ్వన్నెల జెండా రెపరెపలతో సందడిగా మారింది.
అమెరికాలో జరిగిన ఈ భారత స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న తొలి తెలుగు సంఘం మన అమెరికన్ తెలుగు అసోషియేషన్ (మాటా). ఈ సందర్భంగా మాటా వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని ప్రవాసీయులకు, భారతీయులందరికీ 77వ భారత స్వాతంత్య్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రవాసీయులు మాతృభూమి రుణం తీర్చుకుందామంటూ పిలుపునిచ్చారు. మాటా యూఎస్ఏ – మాటా ఇండియా.. ఇలా రెండు చోట్ల తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.