బ్రూనై దారుస్సలాంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. భారత హైకమిషనర్ అధికారిక కార్యాలయమైన ఇండియా హౌస్లో యోగా డేను నిర్వహించారు. బ్రూనై దారుస్సలాంలోని భారత హై కమిషన్ కార్యాలయంలో ఛార్జ్ డి అఫైర్స్గా విధులు నిర్వహిస్తున్న ఎస్డీకే మేనన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అక్కడికి వ్చిన వారికి ఎస్డీకే మేనన్ స్వాగతం పలికి, యోగా డే కార్యక్రమానికున్న ప్రాముఖ్యతను తెలిపారు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవం గుర్తింపు ప్రపంచ వ్యాప్తంగా ఎలా ఉద్యమంలా మారిందో పేర్కొన్నారు.


ఈ సందర్భంగా మేనన్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా, గౌరవంగా ఉందని తెలిపారు. యోగా అనేది మానవాళికి శాశ్వతమైన బహుమతి అని పేర్కొన్నారు. వయసు, నేపథ్యంలో సంబంధం లేకుండా అందరూ దీన్ని ప్రాక్టీస్ చేయవచ్చన్నారు. ప్రపంచమే ఒక వసుదైన కుటుంబం స్ఫూర్తి చాటేలా దౌత్యవేత్తలు, యువత, యోగా ఔత్సాహికులు, స్థానికులు, భారతీయ స్నేహితులదరినీ ఈ కార్యక్రమం ఒక్కచోటికి చేర్చిందన్నారు. వెంకటరమణ రావు సూర్యదేవర, సురేశ్ బొరిగాం, వెంకటేశ్ శాకనూరి తదితరులు యోగా దినోత్సవంలో పాల్గొని ఈ సాంస్కృతిక కార్యక్రమానికి మద్దతు తెలిపారు. బ్రూనైలోని భారత హైకమీషన్ కార్యాలయంలో ఇకపై తరచుగా యోగా సెషన్లు నిర్వహించడానికి, స్థానిక ప్రజల్లో యోగా ప్రాముఖ్యత తెలియడానికి యోగా టీచర్ను నియమించనున్నట్లు ఎస్డీకే మీనన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రూనైలోని తెలుగు ప్రజలు భాగమయ్యారు.















