తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారవేత్తలు ముందుకు రావాలని గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల కోరారు. అమెరికాలోని న్యూ జెర్సీలో ఐటీ సర్వ్ అలయన్స్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమెరికా సెనెటర్ (న్యూజెర్సీ ) కోరి బుకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని రంగాలలో తెలంగాణ ఎంతో ముందుకు దూసుకెళ్తుంది. కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే అత్యంత విజయవంతమైన స్టార్టప్గా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. ఐటీ రంగములో అంతర్జాతీయ సంస్థలను కేటీఆర్ తెలంగాణ తీసుకు వచ్చారు. ఐటీ రంగంలో దేశంలోనే తెలంగాణ ముందింది. రాష్ట్రంలో విద్యుత్ లోటు, నీటికొరత వంటి సమస్యలను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
టైర్ 2 నగరాల్లో ఐటీని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్లగ్, ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించడం వంటి టైర్ 2 నగరాల్లో ఐటీని ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. హైదరాబాద్ కాకుండా టైర్ 2 నగరాల్లో ఇప్పటికే ఐటీ హబ్లు ప్రారంభమయ్యాయి. తెలంగాణలోని టైర్ 2 నగరాల్లో పెట్టుబడి అవకాశాలను వివరించారు. మిగతా టైర్ 2 నగరాలలో విస్తృతం చేసే దాంట్లో భాగంగా రాబోయే రోజుల్లో నిజామాబాద్, మహబూబ్నగర్, సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో త్వరలోనే కేటీఆర్ ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రోత్సహకాలలో భాగంగా మొదటి సంవత్సరం రెంటల్ ఫ్రీగా ఇస్తున్నారని తెలిపారు.అందరూ టైర్ 2 నగరాల్లో పెట్టుబడి పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. తెలంగాణ ఇస్తున్న ప్రోత్సహాకాలపై సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమములో ఐటీ సర్వ్ నేషనల్ ప్రెసిడెంట్ విజయ్ మహాజన్ అలాగే నార్త్ ఈస్ట్ ప్రెసిడెంట్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరిగింది. ఇందులో ప్రవీణ్ తడ్కమల్ల, ప్రవీణ్ ఎండపల్లి, మహేందర్ ముసుకు వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమములో నార్త్ ఈస్ట్కు సంబంధించిన 250 మంది వివిధ కంపెనీల యజమానులు పాల్గొన్నారు.