ఇజ్రాయెల్ అన్నంత పనీ చేసింది. ఇరాన్ పై ప్రతీకార దాడి చేసింది. ఈ విషయంలో సంయమనం పాటించాలన్న ఐక్యరాజ్యసమితి, అమెరికా సూచనలను బేఖాతరు చేస్తూ ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇరాన్పై ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేసినట్లు అమెరికా సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇరాన్లో అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు తెలిసిందే.
ఇస్ఫాహాన్లో విమానాశ్రయం, 8వ ఆర్మీ ఎయిర్ఫోర్స్ బేస్లకు సమీపంలో పేలుడు శబ్దం వినిపించిందని ఇరాన్ పేర్కొంది. ఇరాన్ వైమానిక రక్షణ దళాలు దాడిని తిప్పికొట్టాయని పేర్కొంది. అయితే, అక్కడి ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ, ముందు జాగ్రత్తగా దేశవ్యాప్తంగా గగనతలాన్ని మూసివే సింది. టెహ్రాన్, ఇస్ఫాహాన్, షిరాజ్ నగరాల మీదుగా వెళ్లే వాణిజ్య, పౌర విమానాలకు అనుమతులను రద్దు చేసింది. మరికొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. ఆ నగరంలో అతిపెద్ద సైనిక శిబిరంతో పాటు పలు అణు కేంద్రాలు ఉన్నాయి. కాగా, ఇజ్రాయెల్ దాడులను అడ్డుకోవడానికి పలు ప్రావిన్సుల్లో గగనతల రక్షణ వ్యవస్థలను ఇరాన్ యాక్టివేట్ చేసింది.