అల్లరి నరేష్ కథానాయకుడగా నటించిన తాజా చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఆనంది కథానాయిక. ఏ.ఆర్. మోహన్ దర్శకుడు. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అల్లరి నరేష్ మాట్లాడుతూ ఇది జనం సినిమా. మన చుట్టుపక్కల జరిగే కథగా ప్రజల్లో ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. నిజాయితీతో చేసిన ఈ ప్రయత్యాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నా అని అన్నారు. వ్యవస్థలోని లోపాల్ని ఎత్తిచూపే కథాంశమిది. మన చుట్టూ ఇలాంటి కథల్ని ఎన్నో చూస్తుంటాం. ప్రస్తుతం ప్రేక్షకులు కథల్లో నవ్యతను ఇష్టపడుతున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే సందేశాత్మక సోషల్ డ్రామాగా ఈ సినిమా తీసుకొస్తున్నాం అని తెలిపారు. దర్శకుడు ఏ.ఆర్. మోహన్ మాట్లాడుతూ ఇది సినిమా కాదు కొందరి బతుకు చిత్రం. హృదయాల్ని కట్టిపడేసే భావోద్వేగాలతో పాటు వినోదం, యాక్షన్ హంగుల్నీ ఉంటాయి అని తెలిపారు. ఈ సినిమాలో లక్ష్మీ పాత్రలో కనిపిస్తా. కొత్త నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని నమ్మకం ఉంది అంది నాయిక ఆనంది. నిర్మాత మాట్లాడుతూ నిర్మాతగా నా తొలి చిత్రమిది. కథను నమ్మి నిజాయితీగా కష్టపడ్డాం. చక్కటి సందేశంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజేష్, శ్రీచరణ్ పాకాల, అబ్బూరి రవి, ఛోటా కె.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
