దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ లో భారతీయుడికి జాక్పాట్ తగిలింది. భారత్కు చెందిన శంషుద్దీన్ చెరువట్టంటావిడ దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్లో 1మిలియన్ డాలర్లు(రూ. 8.22కోట్లు) గెలుచుకున్నాడు. దీంతో శంషుద్దీన్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. సెప్టెంబర్ 16న ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన టికెట్ నెం. 1229కు ఈ లక్కీ లాటరీ తగిలింది. గత కొన్నేళ్లుగా జెబెల్ అలీలో ఉంటున్న అతడు గతేడాది నుంచి తన తొమ్మిది మంది స్నేహితులతో ఈ లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఇంత త్వరగా తమకు అదృష్టం వరిస్తుందని ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశాడు. ఇక తాను గెలుచుకున్న ఈ భారీ మొత్తాన్ని తన మిత్రులతో పంచుకుంటానని తెలిపాడు. తన వాటాలో కొంత మొత్తం స్వచ్ఛంద కార్యక్రమాలకు వినియోగిస్తానని చెప్పుకొచ్చాడు. కేరళ రాష్ట్రానికి చెందిన శంషుద్దీన్ చెరువట్టంటావిడకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. జెబెల్ అలీలో రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లకు పీఆర్ఓ గా పనిచేస్తున్నాడు.














