కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ పేరుతో కేసీఆర్, హరీశ్రావుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమన్లు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సమన్లు రాజకీయ ప్రతీకార ధోరణికి నిదర్శనంగా నిలుస్తాయని విమర్శించారు.ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన నాయకులను లక్ష్యంగా చేసుకుని, వారి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు, కోట్లాది ప్రజలకు తాగునీరు అందించారని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారులపై చర్యలు తీసుకోకుండా, కేవలం రాజకీయ నాయకులపై సమన్లు జారీ చేయడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు.

మునుపటి కమిషన్లలోనూ, ఇప్పటి కమిషన్లోనూ బీఆర్ఎస్ నాయకులపై లక్ష్యంగా చర్యలు తీసుకోవడం, అదే సమయంలో ఇతర పార్టీల నేతలను విస్మరించడం, ఈ విచారణల రాజకీయ స్వరూపాన్ని బహిర్గతం చేస్తుందని మండిపడ్డారు. ఈ రాజకీయ కుట్రలను ఖండిస్తూ బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన నాయకులకు మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. ప్రజల న్యాయబద్ధమైన తీర్పు, ఈ కుట్రలకు తగిన సమాధానాన్ని ఇస్తుందని నమ్ముతున్నామన్నారు.
