యూఏఈ సుప్రీం కోర్టు 2019 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి కీలక తీర్పు వెలువరించింది. దుబాయ్లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ భారతీయుడికి రూ.11 కోట్లు పరిహారం కింద చెల్లించాలంటూ ఇన్సూరెన్స్ కంపెనీ ని ఆదేశించింది. భారత్కు చెందిన 20 ఏండ్ల మహ్మద్ బేగ్ దుబాయ్లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఒకరోజు ఒమన్ నుంచి యూఏఈకి బస్సులో ప్రయాణించాడు. అతడు ప్రయాణిస్తున్న బస్సు ఓవర్హెడ్హైట్ బారియర్ను ఢీ కొట్టడంతో ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉండగా అందులో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 12 మంది భారతీయులు. కాగా, బస్సు ప్రమాదంలో బేగ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి మెదడులో సగ భాగం పూర్తిగా దెబ్బతినడంతో చదువు అర్ధాంతరంగా ఆగిపోయింది. ప్రమాదం అనంతరం బేగ్ సుమారు 14 రోజుల పాటు అపస్మారక స్థితిలోనే ఉన్నారు. ఆ తర్వాత రెండు నెలలకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ ప్రమాదంలో బేగ్ మెదడుకు 50 శాతం మేర శాశ్వతంగా నష్టం వాటిల్లిందని వైద్యులు తెలిపారు. దీంతోపాటు ఇతర శరీర భాగాలు కూడా దెబ్బతిన్నట్లు చెప్పారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-20.jpg)
ఈ ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్కు అక్కడి కోర్టు ఏడేండ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా బాధిత కుటుంబాలకు 3.4 మిలియన్ దిర్హామ్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే, బేగ్కు ఇన్సూరెన్స్ కంపెనీ కేవలం ఒక దిర్హామ్ మాత్రమే చెల్లించేందుకు ముందుకొచ్చింది. అందుకు బేగ్ కుటుంబం ఒప్పుకోలేదు. ప్రమాద తీవ్రత దృష్ట్యా అది సరిపోదంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే బేగ్కు 5 మిలియన్ దిర్హామ్ల నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా ఇన్సూరెన్స్ కంపెనీని యూఏసీ సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుతో బేగ్కు భారతీయ కరెన్సీ ప్రకారం రూ.11 కోట్లు పరిహారం కింద అందనున్నాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/4b3127df-f30c-4f25-9c19-7ecfdbd57b90-51-22.jpg)